📺 ANDHARI TV DIGITAL | 🚔 CRIME DESK | ములుగు | Gangadhar
ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న భారీ గుడుంబా రవాణాను పోలీసులు అడ్డుకున్నారు.
పేరూరు ఎస్సై గుర్రం కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో 210 లీటర్ల నిషేధిత గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం సాయంత్రం టేకులగూడెం గ్రామ శివారులో జాతీయ రహదారి–163పై వాహనాల తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఛత్తీస్గఢ్ వైపు నుంచి టేకులగూడెం వైపు వస్తున్న CG17KS-7002 నంబర్ గల బస్సును అనుమానాస్పదంగా గుర్తించి తనిఖీ చేశారు.
తనిఖీల్లో బస్సు డిక్కీలో మూడు బస్తాల్లో ప్యాక్ చేసిన 210 లీటర్ల నిషేధిత గుడుంబా బయటపడింది. స్వాధీనం చేసుకున్న గుడుంబా విలువ సుమారు రూ.84,000 ఉంటుందని పోలీసులు తెలిపారు.
ప్రాథమిక విచారణలో ఈ గుడుంబాను ఛత్తీస్గఢ్ నుంచి జనగామ జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన రమణ, అలాగే అయ్యవారిపేటకు చెందిన కావేరికి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ అక్రమ రవాణాకు బస్సు డ్రైవర్ ఉమేష్ కుమార్ యాదవ్, క్లీనర్ రమేష్ గౌడ్ సహకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనపై సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి, బస్సుతో పాటు గుడుంబాను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై గుర్రం కృష్ణప్రసాద్ తెలిపారు. అక్రమ గుడుంబా తయారీ, నిల్వ, రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసుకు సంబంధించి మరింత దర్యాప్తు కొనసాగుతోంది.