మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లిలో విషాద ఘటన
అందరి టీవీ డిజిటల్ న్యూస్ | మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో దారుణ హత్య చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో సొంత అల్లుడు నరేష్ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
సమాచారం ప్రకారం, నరేష్కు అతని అత్తమామలు కుమారస్వామి, కళమ్మతో కొంతకాలంగా కుటుంబ విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జరిగిన గొడవ తీవ్రరూపం దాల్చడంతో మామ కుమారస్వామి ఇనుప రాడ్తో నరేష్పై దాడి చేసినట్లు సమాచారం.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నరేష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ హత్య ఘటనతో ఉప్పరపల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది