ఉద్యమకారుల హక్కుల కోసం రాష్ట్రవ్యాప్తంగా పోరాటం కొనసాగిస్తాం
మహబూబ్నగర్ | అందరి టీవీ డిజిటల్ న్యూస్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన) మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ ఇన్చార్జ్ ధామోదర్ గౌడ్ విమర్శించారు.
అందరి టీవీ ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, తెలంగాణ ఉద్యమం కోసం జీవితాలను పణంగా పెట్టిన వేలాది మంది ఉద్యమకారులు నేటికీ గుర్తింపు, గౌరవం, సంక్షేమం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రావడం బాధాకరమన్నారు.
"మా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం. ఉద్యమంలో పాల్గొని కేసులు ఎదుర్కొన్న వారికైనా, తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలకైనా ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదు. వారికి అండగా నిలవడం మా పార్టీ బాధ్యతగా భావిస్తున్నాం" అని ధామోదర్ గౌడ్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం సాధించడానికి వేలాది మంది యువకులు తమ చదువులు, ఉద్యోగాలు, కుటుంబాలను త్యాగం చేశారని ఆయన గుర్తు చేశారు. ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది ఇప్పటికీ కేసులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించలేదని అన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఉద్యమకారుల ఆశలను నెరవేర్చడంలో విఫలమయ్యాయని ధామోదర్ గౌడ్ ఆరోపించారు. ఉద్యమకారుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించకుండా రెండు ప్రభుత్వాలు కాలయాపన చేశాయని ఆయన విమర్శించారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం కమిటీలు ఏర్పాటు చేసినప్పటికీ, వాటి ద్వారా స్పష్టమైన ఫలితాలు కనిపించడం లేదని, ఉద్యమకారులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
"తెలంగాణ కోసం త్యాగాలు చేసిన ప్రతి ఉద్యమకారుడికి ప్రభుత్వం గౌరవం ఇవ్వాలి. అమరవీరుల కుటుంబాలకు మరింత ఆర్థిక భరోసా కల్పించాలి. ఉద్యమ కేసులను పూర్తిగా ఎత్తివేయాలి. ఉద్యమకారులకు ప్రత్యేక సంక్షేమ పథకాలు, ఉద్యోగాల్లో ప్రాధాన్యత, గౌరవ వేతనం వంటి అంశాలపై స్పష్టమైన విధానం ప్రకటించాలి" అని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, భారీ మద్దతు ధర్నాలు కొనసాగిస్తామని ధామోదర్ గౌడ్ స్పష్టం చేశారు. ఉద్యమకారులందరూ ఐక్యంగా ముందుకు వచ్చి తమ హక్కుల సాధన కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.